ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు
మెదక్అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026– 27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందివ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో నిధులు సైతం కేటాయించారు. పథకం అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. దీంతో నిరుపేద పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆకలి బాధలు తీరనున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి హైస్కూల్ చదువుల కోసం కాలినడకన వచ్చే విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనకరంగా మారనుంది. తద్వారా డ్రాపౌట్స్ తగ్గే అవకాశం ఉంది.
విజయ డెయిరీ పాలు
సర్కార్ బడుల్లో 10వ తరగతి వరకు విద్యార్థులకు రోజుకో టిఫిన్, పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యానీ, కిచిడి, మరో మూడు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీ ఇవ్వాలని నిర్ణయించారు. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ.8తో, 6 నుంచి 10 తరగతుల వారికి రూ.12 ఖర్చుతో అల్పాహారం అందించనున్నారు. ఇక పౌష్టికాహారంగా పాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిబంధనల మేరకు 150 నుంచి 200 మి.లీ వరకు టెట్రా ప్యాక్లలో పాలు ఇవ్వాలని సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు విజయ డెయిరీకి ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. కాగా గతంలో ఇచ్చే రాగి జావాను మూడు రోజుల పాటు, మరో మూడు రోజులు పాలు ఇవ్వాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై మెదక్ డీఈఓ రాజును వివరణ కోరగా.. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, అయితే ఇంకా ఉత్తర్వులు రాలేదని చెప్పారు.
జిల్లా పాఠశాలలు విద్యార్థులు
మెదక్ 881 68,219
సిద్దిపేట 935 80,541
సంగారెడ్డి 1,222 1,06,299
2,55,059 విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,55,059 విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు చిన్న గ్రామాల్లో ఉండకపోవడం, బస్సు సౌకర్యాల లేమితో చాలా మంది విద్యార్థులు కాలినడకన కాలే కడుపుతో ఉదయం పూట బడికి వస్తుంటారు. వారికి ఈ పథకం ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని అందివ్వనుంది.


