న్యూస్రీల్
వీరు మూడు నుంచి నాలుగేళ్లుగా జిల్లాలోనే కార్యాలయాల్లో షురూవైన బదిలీల ముందస్తు ప్రక్రియ కేడర్ల వారీగా ఉద్యోగుల జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు
ఎనిమిది శాఖల జిల్లా ఉన్నతాధికారులు బదిలీ అయ్యే అవకాశం!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో పలు కీలక శాఖల ఉన్నతాధికారులకు స్థానచలనం కలుగనుంది. దాదాపు నాలుగేళ్లుగా జిల్లాలోనే పనిచేస్తున్న సుమారు ఎనిమిది మంది జిల్లా అధికారులకు ఈసారి బదిలీలు జరిగే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్లు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులు కాగా, నాలుగేళ్లు ఒకేచోట పనిచేస్తున్న వారిని తప్పనిసరిగా బదిలీలు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా శాఖలు, కార్యాలయాల్లో జరుగనున్న బదిలీలు 40% మించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ఈనెల 21న జీఓ జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం జిల్లాలో సుమారు ఎనిమిది శాఖల ఉన్నతాధికారులకు స్థానచలనం కలుగుతుందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి.
బదిలీలు అయ్యే అవకాశం వీరికే
బదిలీలు అయ్యే అవకాశం ఉన్న అధికారులను పరిశీలిస్తే..బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీశ్వర్, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేశ్రెడ్డి, జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ అంబిక, పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంతకుమారి, జిల్లా ఆడిట్ అధికారి బలరాం, సర్వే, ల్యాండ్ రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్ ఈనేష్ తదితరులకు బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరంతా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు జిల్లాలోనే పనిస్తున్నారు. అలాగే ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులు ఒకరిద్దరికి కూడా బదిలీలు జరగనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఏడాదిలోపు పదవీ విరమణ చేయనున్న అధికారులకు కూడా ఈ బదిలీల నుంచి మినహాయింపు ఉండనుంది.


