
అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆసక్తిరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి విడతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉదయం 10.30గంటల నోటిఫికేషన్ జారీ అయ్యాయి. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. తీరా సాయంత్రం ఈ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నం.9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ ఎన్నికల నిర్వహణకు ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది.
అయోమయం.. ఉత్కంఠ
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో నం.9ని జారీ చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం ఈ జీవో నం9పై స్టే విధించింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి, పలువురు పిటీషనర్లకు ఆరు వారాల పాటు గడువు విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేకు పడినట్లయింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకుల్లో ముందు నుంచి అయోమమే నెలకొంది. ఈ ఎన్నికల విషయంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఉత్కంఠగా ఎదురు చూశారు. రిజర్వేషన్లు అనుకూలించిన వారు పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, నాయకులు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. టికెట్ల రేసులో ఇద్దరు, ముగ్గురు ఉన్న చోట్ల ఏకాభిప్రాయానికి ప్రయత్నించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో విచారణ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.