
చెడు వ్యసనాలకు బానిసై.. చోరీలు
● సిగరెట్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్ ● రూ.18 లక్షల సొత్తు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: ఐటీసీ గోదాం సిగరెట్ బాక్స్ల చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పది లక్షల సిగరెట్ బాక్స్లు, మూడు వాహనాలు, రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లికి చెందిన మైదరబోయిన శ్రీకాంత్, కోనాయిపల్లి చెందిన జెట్టి మహేశ్ కొన్నేళ్లుగా ఐటీసీ గోదాం డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఇద్దరి మంచి స్నేహితులు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా గోదాంలోని సిగరెట్ బాక్స్లను అపహరించి డబ్బు సంపాదించాలని పథకం రచించారు. ఈ క్రమంలో గోదాంలో ఉన్న భద్రత లోపాలను గమనించి చోరీకి అనుకూలంగా ఉందని అవకాశం కోసం ఎదురు చూశారు. 2024 డిసెంబర్ 08న అర్ధరాత్రి గోడదూకి గోదాంలోకి ప్రవేశించి టాటా ఏస్ వాహనం తాళాలు పగులగొట్టి అందులోని రూ.8లక్షల 30వేల విలువైన సిగరెట్లు దొంగతనం చేసి అమ్ముకున్నారు. తిరిగి ఇదే తరహాలో 2025 మే 18న రూ.15 లక్షల సిగరెట్లు, సెప్టెంబర్ 9న రూ.10లక్షల విలువైన సిగరెట్లు ఎత్తుకెళ్లారు. ఈ మూడు చోరీల్లో సుమారు రూ.33లక్షల విలువైన గల సిగరేట్ బాక్స్లను అపహరించి, మహేశ్ వ్యవసాయ భూమిలో దాచిపెట్టి రిటైల్ వ్యాపారులకు అమ్ముతున్నారు. సుమారు రూ.18లక్షల 64వేలు రాగా వాటిని సమానంగా పంచుకున్నారు. కాగా మూడోసారి చోరీ చేసిన సిగరెట్లను అమ్మడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో శనివారం జీడిపల్లి వద్ద పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. ఎస్ఐ సుభాష్ గౌడ్
అదుపులోకి విచారించగా చేసిన చోరీలు ఒప్పుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పర్యవేక్ష ణలో సీఐ రంగకృష్ణ, ఎస్సై సుభాష్గౌడ్, సిబ్బంది గోవర్ధన్రావు, రాధాకృష్ణ, భిక్షపతి, నరేందర్గౌడ్, సురేశ్ను జిల్లా ఎస్పీ అభినందించారు.
ఒంటరిగా వెళ్తున్న వారే టార్గెట్
చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
మెదక్ మున్సిపాలిటీ: ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన నీలగిరి దశరథ్ జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటూ పెయింటింగ్ పనులు, రేగోడ్ మండలం లింగంపల్లికి చెందిన బుర్నోటి ఆగమయ్య కూకట్పల్లిలో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. టేక్మాల్ మండలం కొరంపల్లికి చెందిన ధన్నారం కృష్ణ ఇంటర్ చదువుతున్నాడు. వీరు ముగ్గురు కలిసి ఈనెల 7న సెల్ఫ్డ్రైవ్ కారు తీసుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి కారులో ప్రయాణిస్తూ నర్సాపూర్ పట్టణంలో స్కూటీపై వెళ్తున్న కొండయ్యను ఆపారు. అతన్ని కొట్టి రూ.350తోపాటు అతని సెల్ఫోన్ లాక్కున్నారు. అనంతరం నర్సాపూర్ శివారులో గొర్రెల కాపర్లు అయిన నర్సింహ, రామప్పలను కారులో ఎక్కించుకొని మార్గమధ్యలోకి తీసుకెళ్లి వారి వద్ద ఉన్న రూ.8వేల వరకు నగదు, సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. సాంకేతిక ఆధారాలు ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి స్విఫ్ట్ కారు, సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్రెడ్డి, నర్సాపూర్ ఎస్ఐ రంజిత్రెడ్డి పాల్గొన్నారు.