
లోకకల్యాణం కోసం సైకిల్ యాత్ర
పెద్దశంకరంపేట(మెదక్): మండల కేంద్రానికి చెందిన రాంచందర్ లోక కల్యాణం కోసం కశ్మీర్ వరకు సైకిల్ యాత్రను ప్రారంభించాడు. మండల కేంద్రం నుండి ఆయన పలు రాష్ట్రాల మీదుగా వెండి త్రిశూలం సైకిల్పై ఏర్పాటు చేసుకొని కశ్మీర్ వరకు సైకిల్యాత్ర చేపట్టనున్నాడు. మంగళవారం స్థానిక రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సైకిల్యాత్రను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ సత్యం, శిశుమందిర్ హెచ్ఎం వీరప్ప, రమేశ్, సీతారం, మల్లేశం తదితరులున్నారు.
విధులకు ఆటంకం
కేసు నమోదు
దుబ్బాకటౌన్: ఇంటి కొలతలు తీసుకునేందుకు వెళ్లిన మున్సిపల్ కమిషనర్, సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కల్గించిన ఆర్ఎంపీపై కేసు నమోదైంది. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కమిషనర్ రమేశ్ కుమార్ వివరాల మేరకు... పట్టణంలోని 14వ వార్డులో ఆర్ఎంపీ మర్గల రత్నాకర్కు చెందిన ఇంటికి కొలతలు తీసుకునేందుకు గతంలో మున్సిపల్ సిబ్బంది రెండు సార్లు వెళ్లారు. రత్నాకర్ వారిని దూషిస్తూ, ఇంటి కొలతలు తీసుకోకుండా అడ్డుపడ్డాడు. దీంతో మూడు రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో కలిసి కొలతలు తీసుకునేందుకు వెళ్లగా, మరోసారి అను చిత వ్యాఖ్యలు చేస్తూ, దురుసుగా ప్రవర్తించాడు. దీంతో కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రత్నాకర్పై కేసు నమోదు చేశారు.
గంజాయి మొక్కలు స్వాధీనం
వట్పల్లి(అందోల్): గంజాయి మొక్కలను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోగిపేట సీఐ అనిల్కుమార్, ఎస్ఐ లవకుమార్ వివరాల ప్రకారం... మండంలోని బిజిలీపూర్ గ్రామానికి చెందిన గడ్డమీది రాములు తన భూమిలో పత్తిలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఆరు గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గంజాయి సాగుచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి క్లూస్టీం ఇన్చార్జి చిట్టిబాబు, తహసీల్దార్ చంద్రశేఖర్, వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
రెగ్యులర్ డాక్టర్ను
నియమించాలి: సీఐటీయూ
పటాన్చెరు: ఇస్నాపూర్ ఈఎస్ఐ డిస్పెన్సరీలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం వల్ల కార్మికులకు వైద్యం అందడం లేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో డిస్పెన్సరీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ.. రెగ్యులర్ డాక్టర్ను నియమించడంతోపాటు, మందుల కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ డిస్పెన్సరీకి పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి చాలామంది కార్మికులు వస్తారన్నారు. అయితే, రెండు నెలల క్రితం ఇక్కడ ఉన్న రెగ్యులర్ డాక్టర్ లాంగ్ లీవ్లో ఉన్నాడని, ప్రస్తుతం పటాన్న్ చెరు నుంచి డిప్యుటేషన్పై వస్తున్న వైద్యుడు అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. నిరసనలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మానిక్, పాండు రంగారెడ్డి పాల్గొన్నారు.

లోకకల్యాణం కోసం సైకిల్ యాత్ర

లోకకల్యాణం కోసం సైకిల్ యాత్ర