వెల్జాలలో యువకుడి దుర్మరణం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెల్జాలకు చెందిన కూరాకుల రాఘవేందర్(23) శనివారం మధ్యాహ్నం జరిగిన మృతిచెందాడు. తలకొండపల్లి సీఐ జానకిరాంరెడ్డి కథనం ప్రకారం.. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద తన అన్న ఆంజనేయులు, బాబాయి లక్ష్మయ్య, మామ మల్లేశ్తో కలిసి రాఘవేందర్ గణేశ్ మండపాన్ని నిర్మిస్తున్నారు. ఈక్రమంలో మండపం పైకి ఎక్కి కట్టెలను కట్చేస్తుండగా ప్రమాదవశాత్తు కట్టర్ మిషన్ జారి కుడి మోచేయిపై పడటంతో బ్యాలెన్స్తప్పి కిందపడిపోయాడు. కట్టర్మిషన్ ఛాతిపై పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని తల్లి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.
గంజాయి చాక్లెట్లువిక్రయిస్తున్న దంపతుల అరెస్ట్
కొత్తూరు: గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన భోలా(42), సుమనాత్రి దేవి దంపతులు. కొంత కాలంగా కొత్తూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. బీహార్ నుంచి గంజాయి కలిపిన చాక్లెట్లు అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. వీరిపై అనుమానం కలిగిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శనివారం కల్లుదుకాణం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి సుమారు రూ.2 వేల విలువైన 78 గంజాయి చాక్లెట్లు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.


