లోడ్ రాగానే యూరియా ఖాళీ
అంతా ఆన్లైన్
అందరికీ ఇవ్వాలి
మంచాల: యూరియా కొరత, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానంపై రైతులకు అవగాహన లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంచాల పీఏసీఎస్, బోడకొండ ఎరువుల సరఫరా కేంద్రానికి చేరుకున్న యూరియా బస్తాలు నిమిషాల్లోనే ఆన్లైన్లో అమ్ముడవ్వడంతో మొబైల్ వినియోగం రాని చాలా మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి పంటకు యూరియా ఎంతో అవసరం. ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడా ఇది దొరకడం లేదు. దీనికి తోడు ఈ వారం యూరియా సరఫరా కాలేదు. ఈ క్రమంలో శనివారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి 450 బస్తాలు, బోడకొండ ఎరువుల సరఫరా కేంద్రానికి 700 బస్తాల యూరియా వచ్చింది. లారీలో నుంచి దించకముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవడంతో అమ్ముడయింది. కేవలం రెండు నిమిషాల్లోనే యూరియా అయిపోయింది. దీంతో అప్పటిదాకా వేచి ఉన్న రైతులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నాలుగైదు రోజులుగా యూరియా వస్తుందని ఆశతో గ్రామాల నుంచి ఇక్కడకు వచ్చిపోతున్నాం. ఆన్లైన్ పేరిట ఇక్కడ ఉన్న వారికి ఇవ్వకుండా ఎక్కడో ఉండి బుకింగ్ చేసుకున్నారని ఇవ్వడం దారుణమన్నారు. కొద్దిసేపు యూరియా విక్రయించకుండా షటర్ మూసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం అవసరాలకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు.
ఆన్లైన్ బుకింగ్తో క్షణాల్లో విక్రయాలు
యూరియా దొరకక రైతుల ఆగ్రహం
షటర్ మూసి ఆందోళన
యూరియా కావాలంటే ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవాలి. వచ్చిన స్టాక్ వచ్చినట్లుగా నిమిషాల్లోనే బుకింగ్ కావడం జరుగుతోంది. కచ్చితంగా బుకింగ్ చేసుకున్న వారికి ఇవ్వాల్సిందే. నిబంధనలు అందరికి ఒక్కటే. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలి.
– వెంకటేశ్, ఏఓ, మంచాల
యూరియా కోసం నాలుగైదు రోజులుగా ఎదురుచూసినా రావడం లేదు. లోడ్ రాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వారికి నిమిషాల్లో యూరియా ఇస్తున్నారు. చదువురాని రైతులు చాలా ఇక్కట్లకు గురవుతున్నారు. అందరి అవసరాలకు అనుగుణంగా యూరియా ఇవ్వాలి.
– ఐలయ్య, రైతు, తిప్పాయిగూడ


