ఇబ్రహీంపట్నం రూరల్: వర్షాకాల సీజన్లో డయేరియా ప్రబలకుండా నివారణపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి డయేరియా క్యాంపెయిన్, పల్స్ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ, హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఈనెల 15 వరకు సన్నాహక దశగా, 16 నుంచి జూలై 31 వరకు అమలు దశగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అంగన్వాడీ, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈనెల 28న నిర్వహించనున్న పల్స్పోలియో ద్వారా ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జూలై 13న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో డీ వార్మింగ్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న ఇంటింటీకి తిరిగి మాత్రలు అందిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


