ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి ఫిర్యాదుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఆర్ఓ అనంతరెడ్డికి నేరుగా విన్నవిస్తూ, అర్జీలు సమర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం రెవెన్యూ శాఖకు సంబంధించి 28, ఇతర శాఖలకు సంబంధించి 90, మొత్తం 118 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మొహర్రం ఏర్పాట్లు పూర్తి చేయాలి
మొహర్రం ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మొహర్రం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు తదితర అంశాలను మైనార్టీ వర్గాల పెద్దలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేసి చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నవీన్కుమార్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ, వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి


