చేవెళ్ల: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర నాయకుడు పానుగంటి పర్వతాలు అన్నారు. పట్టణ కేంద్రంలో శుక్రవారం ఏఐవైఎఫ్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. , ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యారంగం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతులు లేమి, నిధులకొరత కారణంగా ప్రభుత్వ విద్యావ్యవస్థ బలహీనపడుతుండగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శివకుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.శివ, నాయకులు మధు, జలీల్, సుధాకర్, అనంత్, శివ, రాజు, రమేశ్, యాదయ్య తదితరులు ఉన్నారు.


