మొయినాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్బీఐ ఆర్సెటీ డైరెక్టర్ మహ్మద్ అలీఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో ఉన్న ఎస్బీఐ ఆర్సెటీ కేంద్రంలో నెల రోజుల పాటు మగ్గం వర్క్స్లో ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. 18–50 సంవత్సరాల వయసు ఉండి, పదో తరగతి చదివిన మహిళలు శనివారం ఆర్సెటీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఎస్ఎస్సీ మెమో, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్ వసతి, భోజన సౌకర్యంతోపాటు యూనిఫాం, టూల్ కిట్స్ అందజేస్తామన్నారు. వివరాలకు 85001 65190, 95506 06019 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మంచాల: మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ల తుది జాబితా విడుదల చేశారు. పాఠశాల హెడ్ ఆఫ్ ది స్కూల్ గిరధర్ గౌడ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ కమిటీ సమక్షంలో శుక్రవారం డ్రా తీశారు. మొత్తం 1,200 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ పద్ధతిలో 300 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను పాఠశాలలో అందుబాటులో ఉంచారు. త్వరలో అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.
చేవెళ్ల: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీఎస్ఎన్ఎల్ 5జీ విస్తృత సేవలు, నెట్వర్క్ సమస్యల తొలగింపు కోసం కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి సుమారు రూ.14 కోట్ల వ్యయంతో ఏడు సెల్ఫోన్ టవర్లు మంజూరైనట్లు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తెలిపారు. ఎంపీ కార్యాలయంలో శుక్రవారం ఆయనతో కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.భాస్కరరావు, డీజీఎం అశోక్, లక్ష్మణ్కుమార్, గణేశ్ తదితరులు సమావేశమయ్యారు. టవర్ల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలున్న గ్రామాలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మంజూరైన సెల్ఫోన్ టవర్లను త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విన్నవించిన వెంటనే స్పందించిన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సిందియా, బీఎఎస్ఎన్ఎల్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ రత్నకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.
మొయినాబాద్: ప్రజల జీవితాలతో మమేకమైన కళలు, సాహిత్యం సమాజ మార్పునకు శక్తివంతమైన ఆయుధాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాకురాలు విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్లో రెండు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు పాల్గొని ప్రజా సాంస్కృతికోద్యమ కర్తవ్యాలు, శాసీ్త్రయ సోషలిజం, ఆదివాసీ కళలు, సాహిత్యం, సాంస్కృతిక ఆధిపత్య సిద్ధాంతం వంటి అంశాలపై చర్చించారు. కళాకారులకు డప్పు, పాట, నాటకం వంటి ప్రజా కళారూపాలపై శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విమలక్క మాట్లాడుతూ.. శిక్షణ పొందిన కళాకారులు తమ కళలను సమాజ మార్పుకోసం ఉపయోగించాలన్నారు.


