కేసీఆర్పై కక్షసాధింపు
మీర్పేట: ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసులో విచారణకు పిలిచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు మీర్పేటలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జిల్లెలగూడ, మీర్పేట, అల్మాస్గూడ, బడంగ్పేట మీదుగా బాలాపూర్ చౌరస్తా వరకు నిర్వహించిన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలాపూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్పై వేధింపులకు దిగుతోందని విమర్శించారు. చరిత్ర సృష్టికర్తల జోలికి వస్తే చివరికి చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మీర్పేట, బడంగ్పేట బీఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేశ్రెడ్డి, రామిడి రాంరెడ్డి, నాయకులు అర్కల భూపాల్రెడ్డి, అనిల్యాదవ్, పెండ్యాల నగేష్, దీప్లాల్ చౌహాన్, సిద్దాల అంజయ్య, సునీత, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే..
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


