
కాలిపోయిన డమ్మీ హెలికాప్టర్
బడంగ్పేట్: ఓ డమ్మీ హెలికాప్టర్ కాలిపోయిన సంఘటన కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుర్రంగూడలోని పోచమ్మ టెంపుల్ పక్కన గోకార్టింగ్ ఎదురుగా కొన్నేళ్ల క్రితం సినిమా షూటింగ్ కోసం డమ్మీ హెలికాప్టర్ తయారు చేయించారు. షూటింగ్ అయిపోయిన తర్వాత రోడ్డు పక్కన మైదానంలో ఉంచారు. శుక్రవారం అకస్మాత్తుగా అది కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలు ఆర్పేశారు. అనంతరం మీర్పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హెలికాప్టర్ కాలిపోతున్న దృశ్యాలను కొందరు వీడియోలు తీసి వైరల్ చేశారు. అది చూసి అంతా నిజమైన హెలికాప్టర్కు ప్రమాదం జరిగిందని అనుకున్నారు. ప్రమాదంలో కాలిపోయిందా లేక గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనుల పరిశీలన
కందుకూరు: మండలంలోని మీర్ఖాన్పేట రెవెన్యూలో నిర్మాణంలో ఉన్న స్కిల్స్ యూనివర్సిటీని శుక్రవారం ఫ్యూచర్సిటీ డెవలెప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కమిషనర్ శశాంక సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అక్కడి సైట్ ఇంజనీర్లతో మాట్లాడారు. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు రాను న్నాయి, ఇప్పటి వరకు ఎంత మేర పనులు చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రావణ్కుమార్, తహసీల్దార్ గోపాల్ ఉన్నారు.
టీచర్లు ఫంక్షన్కి..
పాఠాలు గాలికి
కేశంపేట: విద్యార్థినులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు ఏడుగురు మూకుమ్మడి సెలవు పెట్టి ఫంక్షన్కు వెళ్లారు. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, కళాశాల (కేజీబీవీ)లో సుమారు 350 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాల ఎస్ఓగా గౌసియాబేగం విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి స్వగ్రామమైన మహబూబ్నగ ర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విందుకు ఉపాధ్యాయులు కవిత, మంజుల, సుశీల, గౌసియాబేగం, రజిత, అలేఖ్య, వరలక్ష్మి హాఫ్డే సెలవు అంటూ లెటర్ పెట్టుకొని వెళ్లారు. పాఠశాలలో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇలా పిల్లలను వదిలేసి అంతా ఫంక్షన్కు వెళ్లడం చర్చనీయాంశమైంది.
వసతి గృహాల్లో సమస్యలు
పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్
షాద్నగర్రూరల్: ప్రభుత్వ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. వాటిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాత్రివేళల్లో గిరిజన వసతి గృహానికి వాచ్మెన్ లేకపోవడంతో భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శివశంకర్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.