
బీజాపూర్ హైవే పరిశీలన
ప్రమాదాలకు నిలయంగా మారిందని సీపీఐ నాయకుల మండిపాటు
చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి అన్నారు. శనివారం ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ‘ప్రమాదాలకు హైవే’ కథనంపై స్పందించిన సీపీఐ నాయకులు గుంతల రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏళ్లు గడుస్తున్నా పాలకులు రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య నిత్యం ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్న అధికారులతో మాట్లాడి బాగు చేయించాలనే సోయి లేకపోవడం బాధాకరమన్నారు. స్థానిక కేజీఆర్ గార్డెన్ ఎదుట ఏర్పడిన గుంతలు చెరువులను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేదంటే రహదారి దిగ్భంధం చేస్తామని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సీపీఐ నాయకులు ప్రభులింగం, వడ్ల సత్యనారాయణ, సత్తిరెడ్డి, మక్బుల్, మంజుల, లలిత, పెంటయ్య, యాదగిరి, తదితరులు ఉన్నారు.