
బహుజనుల రాజ్యం స్థాపించాలి
ఇబ్రహీంపట్నం: బహుజనుల రాజ్యాన్ని స్థాపించి ఎర్రకోటపై జెండా ఎగురవేయాలని దళితసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు పిలుపునిచ్చారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో పూలే, అంబేడ్కర్ జన జాతర సభను ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. 95 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజనులంతా ఏకమై బహుజన రాజ్యస్థాపనకు కృషిచేయాలన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అందరూ సమానులేనని అంబేడ్కర్ రాజ్యాంగంలో రచిస్తే దానిని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే మెజార్టీ పార్లమెంట్లో లేని కారణంగానే మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయలేకపోయిందన్నారు. మనుధర్మాన్ని అమలు చేస్తే మన బతుకులు పాత కాలంలో మాదిరిగా మారిపోతాయని, మనుషుల మధ్య స్వేచ్ఛ, సమానత్వం ఉండవని, అణగారిన కులాలు ఆగమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కు ద్వారా ఎన్నికల్లో బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించాలని, అప్పుడే మన బతుకులు మారుతాయన్నారు. లెక్కలు తేలితే తమ ఆటలు సాగవని బీసీ జనాభా లెక్కలు తేల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడంలేదని విమర్శించారు. పోరాట లతోనే రాజ్యాధికారం దక్కదని.. ఎన్నికల్లో గెలుపే ప్రధానమన్నారు. అందుకు బహుజనులంతా అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పూలే, అంబేడ్కర్ ఆశయాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. పూలే, అంబేడ్కర్లను స్మరించకపోతే మన భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలనే దుర్భర పరిస్థితులు నేడు దేశంలో నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవీపీఎస్ నేతృత్వంలో బహుజనులను ఏకం చేస్తూ రాజ్యాధికారం వైపు నడిపించే పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు, జిల్లా అధ్యక్షుడు సామేల్, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
దళితసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జేబీ రాజు