కొత్తూరు: గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే తపనతో డ్రైవర్ చేసిన తప్పిదానికి టపాసుల లోడ్తో వెళ్తున్న ఓ లారీ విద్యుదాఘాతంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మండల పరిధిలోని పెంజర్లలో శనివారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి టపాసుల లోడ్తో ఓ లారీ మహేశ్వరం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టపాసులు అన్లోడ్ చేసేందుకు బయలుదేరింది. కాగా లారీ డ్రైవర్ మహేశ్వరంలో సూచించిన చిరునామాకు త్వరగా చేరుకునేందుకు పెద్ద రహదారిని వదిలి చిన్న రోడ్డు మీదుగా వెళ్తుండగా పెంజర్ల శివారులో లారీకు హైటెన్షన్ వైర్లు తగలి మంటలు చెలరేగాయి. కాసేపటికి గుర్తించిన డ్రైవర్లు అయ్యప్పన్, సత్తివేలు వెంటనే లారీను రోడ్డు పక్కన నిలిపి బయటకు దిగారు. మంటల తాకిడికి లారీలో ఉన్న టపాసులు మొత్తం భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల తాకిడితో సమీపంలోని పంటలకు సైతం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు. సంఘటన స్థలాన్ని షాద్నగర్ డీసీపీ శీరిష, ఏసీపీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సయ్య తెలిపారు.


