కొడుకు హత్యకు తల్లి ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

కొడుకు హత్యకు తల్లి ప్లాన్‌

Apr 26 2026 5:03 AM | Updated on Apr 26 2026 5:03 AM

మంథనిరూరల్‌: కన్న కొడుకునే మరో కొడుకుతో అంతం చేయాలని చూసిందో తల్లి.. అర్ధరాత్రి నిద్రిస్తున్న అన్నపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసేందుకు యత్నించిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. మంథని మండలం లక్కేపూర్‌ గ్రామానికి చెందిన కొత్త రఘుపై అతడి తమ్ముడు అనిల్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించగా తీవ్రగాయాలు కావడంతో ఎంజీఎంకు తరలించారు. బాధితుడి సోదరి పాలడుగు సౌజన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. రఘు తండ్రి 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. తల్లి జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి గ్రామంలోనే ఉంటున్నారు. తల్లి ప్రవర్తన బాగా లేకపోవడంతో తరచూ పెద్ద తమ్ముడు గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి సైతం గొడవ జరగడంతో తనకు అడ్డుగా వస్తున్నాడని భావించిన తల్లి.. తన చిన్న కొడుకుతో పెద్ద కొడుకును చంపాలని పథకం వేసింది. ఈక్రమంలో అంతకుముందే తెచ్చుకున్న పెట్రోల్‌ను నిద్రిస్తున్న రఘుపై పోసి నిప్పంటించాడు. మంటల తీవ్రతకు అరవడంతో స్థానికులు గమనించి వెంటనే కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. విచారణ జరిపి తన పెద్ద తమ్ముడిపై హత్యాయత్నం చేసిన చిన్నతమ్ముడు అనిల్‌, తల్లి జ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలని సౌజన్య తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్నట్లు మంథని పోలీసులు తెలిపారు.

చిన్న కొడుకును ప్రేరేపించిన తల్లి

పెట్రోల్‌పోసి నిప్పంటించిన వైనం

చావుబతుకుల్లో పెద్దకుమారుడు

లక్కేపూర్‌ గ్రామంలో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement