● కొన్ని నెలలుగా ఇబ్బందిపడ్డ ప్రయాణికులు ● ‘సాక్షి’ వరుస కథనాలు ● స్పందించిన అధికారులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రోడ్డుపై ఉన్న వంతెనపై పడ్డ భారీ గుంత మరమ్మతు పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దాదాపు ఎనిమిది నెలల క్రితం పదిర వద్ద గల బ్రిడ్జిపై భారీ గుంత పడింది. ఇక్కడ భారీ వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో గుంతను మట్టితో పూడ్చి హెచ్చరిక బోర్డు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి పదిర బ్రిడ్జి వద్ద ఒక వాహనం దాటిన తర్వాతే మరో వాహనం వెళ్లాయి. ఈ గుంతతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యా యి. స్పందించిన అధికారులు వంతెన మరమ్మతుకు రూ.3.75లక్షలు మంజూరు చేసి, టెండర్ పిలిచారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ సోమవారం పనులు ప్రారంభించారు. దీంతో వాహనాలను దారి మళ్లించారు. పదిర గ్రామంలో నుంచి హరిదాస్నగర్ పెద్దమ్మగుడి వరకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు పనులు ముగియడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.
బ్రిడ్జి మరమ్మతు పనులు


