యర్రగొండపాలెం: పింఛన్ కోసం పడికాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ తీసుకోవాలన్న ఆదుర్దాతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 6 గంటలకే మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలోని జి.ఉమ్మడివరం పరిధిలోని వృద్ధులు, దివ్యాంగులు, ఇతరులు ఆ గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ పింఛన్ ఇచ్చే నాథుడు కనిపించకపోవడంతో 11 గంటల వరకు వారు అక్కడికి సమీపంలో ఉన్న జాతీయ రహదారి డివైడర్లపై కూర్చొని సంబంధిత పంచాయతీ కార్యదర్శి కోసం ఎదురు చూడటం పలువురుని కలచివేసింది. ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారని ప్రశ్నిస్తే.. ‘‘ఈ రోజు 1వ తేదీ అయ్యా..పింఛన్ కోసం పొద్దున్నే వచ్చాం. ఇప్పటి వరకు పింఛన్ ఇచ్చే సారు రాకపోవడంతో ఇక్కడ కూర్చొని ఆయన కోసం ఎదురు చూస్తున్నామని’’ వారు బదులిచ్చారు. ఇంటివద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాల్సిన సిబ్బంది వృద్ధులు, దివ్యాంగులు అనికూడా చూడకుండా వారిని తమ వద్దకే రప్పించుకుంటున్నారని, వారికి కనీసం కనికరం కూడా లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యానించారు.


