కలెక్టర్ ఎం.విజయ సునీత వేములకోట, దేవరాజుగట్టు పునరావాస కాలనీల్లో జేసీతో కలిసి తనిఖీలు
మార్కాపురం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో ముంపు నిర్వాసితులకు అవసరమైన అన్ని మౌలిక వసతులకు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. శనివారం మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు మండల పరిధిలోని దేవరాజుగట్టు, తోకపల్లి, మార్కాపురం మండలంలోని వేములకోట, ఇడుపూర్–1, ఇడుపూర్–2 పునరావాన కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జేసీ పి.శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కాలనీల లేఅవుట్లు, పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాలనీలకు వెళ్లే అప్రోచ్ రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుద్ధీకరణ పనులకు ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా జంగిల్ క్లియరెన్స్ పూర్తికాని ప్రాంతాల్లో వెంటనే పొదలను తొలగించి భూమిని లెవలింగ్ చేసి మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని సూచించారు.


