న్యూస్రీల్
సగిలేరు వాగును గుట్టలుగా తవ్వేస్తున్న మాఫియా పట్టపగలే జేసీబీలతో తవ్వకాలు, ట్రాక్టర్లతో తరలింపు భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిన వాగు అక్రమ తవ్వకాలపై అధికారులు మౌనం దుప్పిల తిప్పలో దుప్పిలు లేవు
గ్రావెల్ దందాలో
సగిలేరు వాగులో పెద్ద పెద్ద గుంతలు
గిద్దలూరు రూరల్: మార్కాపురం, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న సగిలేరు వాగును అక్రమార్కులు చెరబట్టారు. గిద్దలూరు పట్టణం మీదుగా కడప జిల్లా కలెశపాడులో ప్రవేశిస్తుంది. గిద్దలూరు పట్టణ శివారులోని కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న సగిలేరు వాగు వర్షాకాలంలో జలకళ సంతరించుకుంటుంది. మిగతా రోజుల్లో నీటి ప్రవాహం ఉండదు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. వాగులో అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టీడీపీ మద్దతుదారులుగా ప్రచారంలో ఉన్న కొందరు వ్యక్తులు జేసీబీలతో వాగులో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టి వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించేస్తున్నారు. దీంతో వాగులో భారీ గుంతలు ఏర్పడి పర్యావరణానికి, ప్రజల భద్రతకు ముప్పుగా మారింది. ఇప్పటి వరకు రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిన మట్టి దందా పగటి పూటే సాగుతోంది. కొండలను చదును చేస్తూ జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తరలించే ట్రాక్టర్లు అతివేగంగా వెళుతుండడంతో రహదారులపై రాళ్లు, మట్టి పడిపోతున్నాయి.
రోజుకు వందకిపైగా ట్రాక్టర్లలో తరలింపు..
సగిలేరు వాగులో అక్రమ తవ్వకాలు చేస్తున్న మాఫియా రోజుకు సుమారు 100కు పైగా ట్రాక్టర్లలో గ్రావెల్ తరలిస్తోంది. ప్రస్తుతం రూ.1,000– రూ.1,100 వరకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీ అండతో గ్రావెల్ మట్టి వ్యాపారం లాభదాయక దందాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరవ రోడ్డులోని కొండ ప్రాంతాలు, సమీప తిప్పల నుంచి ప్రతిరోజూ వందల ట్రిప్పుల మట్టి గిద్దలూరు పట్టణానికి తరలిస్తున్నప్పటికీ అధికారులు అడ్డుకుని చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీనరేజీ పేరిట బహిరంగ వసూళ్లు
గ్రావెల్ మట్టి, ఇసుక రవాణాపై ప్రభుత్వం తరఫున సీనరేజీ వసూలు బాధ్యత చేపట్టిన ప్రైవేటు సంస్థ పోరుమామిళ్ల రోడ్డులోని సగిలేరు బ్రిడ్జి, అంబవరం రోడ్డు, ఒంగోలు హైవే వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. పట్టణంలోకి వచ్చే ప్రతి ట్రాక్టర్కు రూ.350 చొప్పున నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లకు ఎలాంటి రసీదులు ఇవ్వడంలేదని, మొత్తం వసూలు చేసే సంస్థ మింగేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీ నేతల అండతో మట్టి మాఫియా బరితెగించింది. గిద్దలూరు పట్టణం శివారులో సగిలేరు వాగును చెరబట్టింది. బహిరంగంగా జేసీబీలతో తవ్వకాలు చేస్తోంది. రోజుకు వందలాది ట్రాక్టర్లలో మట్టిని తరలించేస్తోంది. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుండడంతో వాగులో భారీ గుంతలు ఏర్పడి వాగు ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తవ్వకాలు ఆపాలి..
గిద్దలూరు సమీపంలోని కొండపేట ఆంజనేయస్వామి ఆలయం వెనుక సగిలేరు వాగులో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపేయాలి. వాగును భారీ గుంతలుగా మార్చి అక్రమ వ్యాపారం సాగిస్తున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– మానం బాలిరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్


