● ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రేణింగవరం శివ శక్తి వే బ్రిడ్జి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. మంగళగిరికి చెందిన చెల్లూరి రామసుబ్రమణ్యం(22) కావలిలో బంధువుల ఇంట శుభకార్యానికి బైక్పై వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై రేణింగవరం సమీపంలో వే బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మంగళగిరిలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. మృతుడికి తల్లిదండ్రులు లేరు. సంఘటన స్థలాన్ని రేణింగవరం పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మీ సేవలు ఎప్పటికీ మరువం
● ఎస్పీ హర్షవర్ధన్రాజు
ఒంగోలు సిటీ:
సుదీర్ఘకాలం ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ నిబద్ధతతో అందించిన సేవలు ఎప్పటికీ మరువమని ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బందిని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ అన్ని వేళలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జి.సుబ్రహ్మణ్యం, బి.రాంబాబు, ఏ.సత్యం, కట్టా రమణయ్యలు ఉద్యోగ విరమణ చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, ఏఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


