ఒంగోలు సబర్బన్: ప్రకాశం భవన్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం (పీజీఆర్ఎస్) సమయంలో మార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ పీ రాజాబాబు వివరించారు. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈనెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్లో జరగబోవు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్రమానికి చేరుకొని వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు.
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని కృష్ణబాబు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు బడుగు ఇందిర, ఒంగోలు సిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల ప్రమీల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజును, రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ ఫీజులను ఈ నెల 27వ తేదీ లోపల చెల్లించాలని ఆర్ఐఓ ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు తేదీ తర్వాత ఎటువంటి అభ్యర్థనలు స్వీకరించరన్నారు. ఈ విషయాన్ని సంబంధిత విద్యార్థులు గమనించి గడువు తేదీ లోపు ఫీజులు చెల్లించాలని కోరారు.
ఒంగోలు టౌన్: పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవడం ద్వారా దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రతలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి ఎన్.మధుసూదన రావు చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక వెంకటేశ్వర కాలనీలో అర్బన్ వైద్యశాల సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడుతూ మలేరియా రహిత సమాజంలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. దోమకాటు నుంచి రక్షణ కోసం దోమతెరలను వాడాలని, లేకపోతే విషజ్వరాల బారిన పడే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఓ విజయ భాస్కర్, సబ్ యూనిట్ ఆఫీసర్లు ఇండ్ల సాగర్, పాతులూరి శ్రీనివాసులు, పద్మావతి, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు నిర్దేశిత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ విజయసునీత సూచించారు. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర సాధనా విజన్పై వివిధ శాఖల అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ వచ్చే నెలకు సంబంధించి నెలవారీ టార్గెట్లను ఈనెల 27వ తేదీ లోపు నిర్ణయించి అప్రూవల్ తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రతినెలా 5వ తేదీ నాటికి ఆ నెల సాధించిన పురోగతిని ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. డీఐఈపీసీ పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో రిలయన్స్ పరిశ్రమలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న సీబీజీ ప్రాజెక్టులు ఏపీఎన్జీఈఎల్, హరిత అమృత్ ఏర్పాటు చేసిన సోలార్ పవర్ పురోగతి, ఎంఓయూలు చేసుకునే పరిశ్రమల పురోగతిపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డి, సీపీఓ స్వరూపారాణి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు మధున్మోహన్, నాబార్డు డీడీఎం రవికుమార్, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


