త్రిపురాంతకం: జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన త్రిపురాంతకంలోని బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో వసంత నవరాత్రుల్లో భాగంగా వ్యాఘ్ర వాహన సేవ శనివారం వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, ఉభయదాతల పూజలు, హోమాలు వైభవంగా వేదపండితులచే నిర్వహించారు.
వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో వెలసిన మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం శనివారం ఆదాయం రూ.9,03,211 వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ఆదాయంలో భాగంగా కుంకుమార్చన ద్వారా రూ.20,880, తలనీలాలు రూ.32,925, ప్రత్యేక దర్శనం రూ.4,12,600, రూం అద్దెలు రూ.31,360, లడ్డు ప్రసాదాలు రూ.2,15,560, అన్నదానం రూ.1,60,035 ఇతర విరాళాలు కలిపి ఆదాయం రూ.9,03,211 వచ్చినట్లు తెలిపారు.
ఒంగోలు సబర్బన్: విద్యుత్ వినియోగదారుల కోసం ఆదివారం సెలవు రోజు అయినా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా ఏర్పా ట్లు చేసినట్లు జిల్లా ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టించుకునే కౌంటర్లు యధావిధిగా పనిచేస్తాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ బిల్లులు ఫోన్ పే, డిపార్ట్మెంట్ యాప్ ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చన్నారు.
కొనకనమిట్ల: మండలంలోని పాతపాడులో అగ్ని ప్రమాదంలో పొగాకు బ్యారన్ పూర్తిగా కాలిపోయిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన కొండపురెడ్డి పెదవెంకటరెడ్డి, చినవెంకటరెడ్డ్లికు చెందిన పొగాకు బ్యారన్లలో పొగాకు క్యూరింగ్ జరుగుతోంది. బ్యారన్లో సుమారు 1100 పొగాకు అల్లుడు కర్ర క్యూరింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మొద్దు గొట్టంపై అల్లుడు కర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బ్యారన్లలోని పొగాకు అల్లుడు కర్ర మొత్తం పూర్తిగా కాలిపోయింది. బ్యారన్లోని టైర్లు, రేకులు, అల్లుడు కర్ర అగ్ని ప్రమాదంలో దగ్ధమైపోయాయి. మంటల ధాటికి బ్యారన్ గోడలు నెర్రలిచ్చాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మార్కాపురం అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. అప్పటికే బ్యారన్ పూర్తిగా దగ్ధమైంది. అల్లుడు కర్ర, బ్యారన్ మొత్తం రూ.3 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత రైతులు వాపోయారు.
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో శనివారం అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి ఆలయ అర్చకులు అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, ప్రత్యేక పూలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య, చైర్మన్ సిద్ధం నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు కాశీనాయన రెడ్ల, యోగివేయన రెడ్ల, కృష్ణదేవరాయుల కాపుబలిజ, ఆర్యవైశ్య, గోపాలకృష్ణ యాదవ అన్నదాన సత్రాల్లో అన్నసంతర్పణ చేశారు.


