
మద్యం మత్తులో ఘర్షణ
మార్కాపురం: మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు వ్యక్తిగత కారణాలతో బుధవారం మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్కులో ఘర్షణకు దిగారు. పోలీసుల కథనం మేరకు.. షేక్ మహబూమ్ సుబానీ, అతని తండ్రి బాబు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం మద్యం సేవించి గాంధీ పార్కులో కూర్చుని ఉండగా, అదే సమయంలో నాగరాజు అనే మరో కూలీ వచ్చి అసభ్యకరంగా తిట్టాడు. దీంతో సుబానీ కోపోద్రిక్తుడై నాగరాజుపై దాడి చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు టూటౌన్ ఎస్సై రాజమోహన్రావు తెలిపారు.
ఒంగోలు సిటీ: ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు జిల్లాలోని ఆర్టీసీ డిపోల్ల్లో అప్రెంటీస్ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రధానాచార్యుడు, సహాయ అప్రెంటీస్ అడ్వైజర్, జిల్లా కన్వీనర్ సీహెచ్ఎస్వీ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో డీజిల్ మెకానిక్ 37, మోటార్ మెకానిక్ 2, ఎలక్ట్రీషియన్ 9, వెల్డర్ 1, పెయింటర్ 1, ఫిట్టర్ 3, డ్రాఫ్ట్మన్ సివిల్ ఒకటి చొప్పున మొత్తం 54 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థులకు అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణా భృతి చెల్లిస్తామని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 97031 65456ను సంప్రదించాలని సూచించారు.
● కలెక్టర్ పి.రాజాబాబు
ఒంగోలు టౌన్: మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుందని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం జీజీహెచ్లో మహిళల అరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో మహిళలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య సేవలు అందించన్నుట్లు తెలిపారు. మహిళలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట , ఎమ్మెల్యే దామచర్ల, మేయర్ సుజాత, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ శ్యామల, డీసీహెచ్ఎస్ శ్రీనివాసనాయక్, ఐసీడీఎస్ పీడీ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్ ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2000 సంవత్సరం నుంచి ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లు పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులు 140 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 169 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు మరణించారని, అందులో ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది ఉన్నారని తెలిపారు. వైద్యం నిమిత్తం రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినా టీచర్లు మరణించారని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మెడికల్ సౌకర్యం లేనందున రీయింబర్స్మెంట్ కల్పించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.