
జీఛీహెచ్..!
సర్వజన ఆస్పత్రిలో పెరిగిపోతున్న అవినీతి రోగులకు వైద్య సేవల కన్నా ముడుపులే ముఖ్యం ఆర్ఎంఓ ఆఫీసుపైనా ఆరోపణలు సర్టిఫికెట్ కావాలంటే నైవేద్యం చెల్లించుకోవాల్సిందే చక్రం తిప్పుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది అనుమతులు లేకుండానే క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (రిమ్స్) అవినీతికి కేంద్రంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ నేతల జోక్యంతో కొంతమంది అధికారులు, సిబ్బంది అవినీతికి తెరతీశారు.
అందిన కాడికి నొక్కేస్తున్నారు. కోరిన సమయం, కావాల్సిన డ్యూటీలు
వేయించుకునేందుకు భారీగా ముడుపులు చెల్లించి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఎంఓ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇక్కడ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, మారో అధికారి కలిసి చక్రం తిప్పుతున్నారు.
ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి
జీజీహెచ్కు వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం. ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా మద్యం పంపిణీ చేసిన వారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా మారి అవినీతికి
పాల్పడుతున్నారన్న ఆరోపణలు
వెల్లువెత్తుతున్నాయి.
చక్రం తిప్పుతున్న
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వం రాగానే ఒంగోలులోని టీడీపీ నాయకులు జీజీహెచ్పై కన్నేశారు. గత ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ చేసినట్లు అరోపణలు ఉన్న ముగ్గురికి కీలక విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా నియమించుకుని అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో ఇద్దరు 2014–19లో టీడీపీ పాలనలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ద్వారా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం ఆప్కాస్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
సాక్షి టాస్క్ పోర్స్:
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి ప్రతి రోజూ 800 నుంచి 1200 మంది వరకూ రోగుల తాకిడి ఉంటుంది. అలాగే వివిధ సర్టిఫికెట్ల కోసం వందల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఓపీ నుంచే వారికి కష్టాలు ప్రారంభమతున్నాయి. రోగులకు సేవలందించాల్సిన సిబ్బంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాల్సిన డాక్టర్లు జూనియర్లకు అప్పజెప్పి ప్రైవేట్ వైద్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొంతమంది నర్సింగ్ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకుండా ట్రైనీ నర్సింగ్ స్టాఫ్తో పనులు చేయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్పత్రిలో రాజకీయాలు, అవినీతి పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి.
ఆర్ఎంఓ కార్యాలయంలో
ఏం జరుగుతోంది..?
ఆస్పత్రిలో ఆర్ఎంఓ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ పాలనలో ఆర్ఎంఓ కార్యాలయంలో కేవలం ఆర్ఎంఓ మాత్రమే ఉంటూ విధులు నిర్వహించేవారు. ఏడాదిన్నర కాలంగా ఆర్ఎంఓ కార్యాలయంలోనే డీఆర్ఎంఓ తిష్ట వేశారు. ఆయనతో పాటుగా మెడికల్ కాలేజీకి చెందిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా అక్కడే ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు వివిధ రకాల సర్టిఫికెట్ల కోసం ఇక్కడకు వస్తుంటారు. బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంటారు. ఒక్కో సర్టిఫికెట్కు ఒక్కో రేటు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పైసలు చేతిలో పడనిదే ఏ ఒక్కరికి కూడా సంబంధిత సర్టిఫికెట్లు చేతికి ఇవ్వరని చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల డ్యూటీల విషయంలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఆర్ఎంఓ కార్యాలయంలో మిగతా సిబ్బందికి పనేంటని అడిగే వారే లేకుండా పోయారని ఇక్కడకు వచ్చే రోగులు ప్రశ్నిస్తున్నారు.
భారీగా వసూళ్లు..
ఉన్నతాధికారుల విచారణ
జిల్లా కేంద్రమైన ఒంగోలులో మూడంతస్తుల భననంలో నిర్వహించే ఈ బోధనాసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందిచేందుకు 700 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వీరికి నెలకోసారి రోస్టర్ ప్రకారం డ్యూటీలు వేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు మూడు షిఫ్ట్లుగా విభజించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు రెండో షిఫ్ట్, రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మూడో షిఫ్ట్. నెలకోసారి డ్యూటీలు మారుతుంటాయి. అయితే కొందరు నర్సులు తమకు అనువైన సమయంలో డ్యూటీ వేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నర్సుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఇన్చార్జి మడుపులు వసూళ్లకు పాల్పతున్నట్టు తెలుస్తోంది. ఒక్క డ్యూటీల విషయంలోనే కాకుండా సిబ్బందికి సెలవులు కావాలన్నా, బదిలీలపై వెళ్లే వారిని రిలీవ్ చేయాలన్నా నైవేద్యం చెల్లించాల్సిందేనని జీజీహెచ్లో చెప్పుకుంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై ఉన్నతాధికారులు రెండు రోజులపాటు విచారణ కూడా చేశారని తెలిసింది.
ఎమ్మెల్యే గన్మెన్కు క్యాంటీన్
జీజీహెచ్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పంచుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని హాస్టల్ను ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే గన్మెన్కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సమాచారం. అదే కాలేజీలోని బాలికల హాస్టల్ను ఒంగోలు టీడీపీ మహిళా నాయకురాలికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రి ఆవరణలో వున్న క్యాంటీన్లకు కూడా ఎలాంటి అనుమతులు లేవని సమాచారం. అధికార పార్టీ బరితెగించి అవినీతికి పాల్పడుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.