మూడు పెళ్లిళ్లు .. క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మూడు పెళ్లిళ్లు .. క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య

Dec 28 2023 1:10 AM | Updated on Dec 28 2023 1:09 PM

- - Sakshi

ప్రకాశం: కుటుంబ సభ్యులతో గొడవపడిన ఓ యువకుడు క్షణికావేశంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన టంగుటూరు మండలంలోని ఎం.నిడమానూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. కొండపి గ్రామానికి చెందిన లక్కి హరీష్‌(26) బొంతలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాడు.

ఇతనికి రెండు నెలల క్రితం మూడో వివాహమైంది. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో వివాదం తలెత్తడంతో ఆవేశంగా బయటకువచ్చాడు. ఎం.నిడమానూరు–మర్లపాడు గ్రామాల మధ్య ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువు వద్ద ద్విచక్ర వాహనాన్ని గమనించిన గ్రామస్తులు అనుమానంతో చుట్టుపక్కల పరిశీలించగా మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఖాదర్‌బాషా సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీశారు.

అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement