ప్రేమ పేరుతో వెంటాడి వేధించాడు | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వెంటాడి వేధించాడు

Feb 6 2024 1:46 AM | Updated on Feb 6 2024 1:56 PM

- - Sakshi

ఒంగోలు: రాజకీయ అండను అడ్డంగా పెట్టుకుని ఓ యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి, పెళ్లి చేసుకున్న తర్వాత అత్యంత కిరాతకంగా వేధింపులకు గురి చేసి, ఆమె ఆత్మహత్యకు కారణమైన కేసన సాయిరాఘవేంద్రని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దళిత నాయకులు నీలం నాగేంద్రరావు, చప్పిడి వెంగళరావు, దారా అంజయ్య, కేరళ దిలీప్‌ తదితరులు సోమవారం తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డిని కలిసి మాట్లాడారు.

అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన దళిత యువతి లింగతోటి తులసిని.. సాయి రాఘవేంద్ర ప్రేమ పేరుతో వెంటాడి గత ఏడాది ఫిబ్రవరి 5న గుడిలో వివాహం చేసుకొని మూడు నెలల్లోనే ఆమెకు నరకం చూపించాడన్నారు. వివాహం అనంతరం శారీరకంగా, మానసికంగా వేధించసాగి రూ.10 లక్షల కట్నం తీసుకురావాలంటూ కొట్టి పుట్టింటికి తరిమేశాడన్నారు. జులాయిగా తిరుగుతూ దామచర్ల అనుచరునిగా చలామణి అయ్యే సాయి.. అత్తమామలు కట్నం ఇవ్వకపోవడంతో గొడ్డలితో చంపుతానని బెదిరించడంతో తాలూకా పోలీసులు రౌడీషీట్‌ కూడా ఓపెన్‌చేశారన్నారు.

ఇటీవల బంధువుల అనారోగ్యంతో రిమ్స్‌లో చికిత్స పొందుతుండంతో తులసి వారిని పరామర్శించేందుకు బంధువుల మోటారు సైకిల్‌పై వెళ్లిందన్నారు. ఇది గమనించిన సాయి అత్తగారింటికి చేరుకుని తులసిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, అడ్డువచ్చిన తల్లిదండ్రులు, బంధువులపై హత్యాయత్నం చేశాడన్నారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తులసి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయడంతో తల్లిదంత్రులు ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందిందన్నారు. ప్రేమ పేరుతో వివాహం చేసుకొని ఆమెను వేధించి ఆత్మహత్యకు కారణమైన సాయిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement