కోల్కతా: టీఎంసీ ఎంపీలు యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా, కాకోలి ఘోష్ దస్తిదార్, సయోనీ ఘోష్ సహా 19 మంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఓ లేఖ సమర్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామన్న తమ నిర్ణయాన్ని అందులో వెల్లడించినట్టు సమాచారం.
కాకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో రెబెల్ ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ వర్గాన్ని ఏర్పాటు చేసి, ఎన్డీఏకు మద్దతు ప్రకటించినట్టు జాతీయ మీడియా తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టీఎంసీ సంస్థాగత సంక్షోభం బయటపడింది. తొలుత పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రారంభమైన తిరుగుబాటు ఇప్పుడు పార్లమెంట్ వరకు విస్తరించింది.
అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు మమతా బెనర్జీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదు. అంతర్గత అసంతృప్తిగా మొదలైన వ్యవహారం ఇప్పుడు ఎమ్మెల్యేల, ఎంపీల సంఖ్యాబలం, సంస్థాగత నియంత్రణ, రాజకీయ చట్టబద్ధతపై పోరాటంగా మారింది.
శాసనసభలో మొదలైన చీలిక పార్లమెంట్ వరకు విస్తరించింది. సీనియర్ రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్ తమ రాజ్యసభ సభ్యత్వాలకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తిరుగుబాటు శిబిరంలో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు
- శత్రుఘ్న సిన్హా (ఆసన్సోల్)
- కాకోలి ఘోష్ దస్తిదార్ (బరాసత్)
- జగదీశ్ చంద్ర బసునియా (కూచ్ బెహార్)
- ఖలీ ఉర్ రెహ్మాన్ (జంగీపూర్)
- యూసుఫ్ పఠాన్ (బెహ్రంపూర్)
- అబూ తాహిర్ ఖాన్ (ముర్షిదాబాద్)
- పార్థ భౌమిక్ (బారక్పూర్)
- బాపి హల్దార్ (మథురాపూర్)
- సాయోని ఘోష్ (జాదవ్పూర్)
- మాలా రాయ్ (కోల్కతా దక్షిణ)
- మితాలి బాగ్ (ఆరాంబాగ్)
- దీపక్ అధికారి (ఘటాల్)
- కాలీపద సోరెన్ (ఝార్గ్రామ్)
- జూన్ మాలియా (మెదినీపూర్)
- అరూప్ చక్రవర్తి (బాంకురా)
- షర్మిలా సర్కార్ (వర్ధమాన్ తూర్పు)
- అసిత్ కుమార్ మాల్ (బోల్పూర్)
- శతాబ్ది రాయ్ (బీర్భూమ్)
- రచనా బెనర్జీ (హుగ్లీ)


