సాక్షి, కృష్ణా: టీడీపీ వాళ్ల కళ్లల్లో ఆనందం కోసం పోలీసు వ్యవస్థ ఇంతలా దిగజారిపోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు.. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ దగ్గరున్న వారిని భయపెట్టాలనుకుంటున్నారా?.. లోకేష్ ఒక్కడికే విద్య తెలుసు అనుకుంటున్నాడా అని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పూడి శ్రీహరిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు. ఏం నేరం చేశారని శ్రీహరిని అరెస్ట్ చేయించారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఒక విలేకరిగా ఎదిగి పైకొచ్చిన వ్యక్తి పూడి శ్రీహరి. మీరు చేసేది చట్టబద్ధమైన చర్య అయితే ప్రెస్ మీట్ పెట్టి శ్రీహరిని అరెస్ట్ చేయించండి. శ్రీహరి ఏమైనా నేరాలు చేశాడా?. ఎవరిని భయపెట్టడానికి మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తున్నారు.
సోషల్ మీడియా కేసుకు ఇలా తీసుకెళతారా. చంద్రబాబు మీరు ఏం నేర్పిస్తున్నారు?. మీ తప్పులను ప్రశ్నిస్తున్నందుకు 20 నెలల నుంచి అందరినీ లోపల వేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిని భయపెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు మంగళహారతి పాడేందుకు జనం సిద్ధమైపోయారు. తప్పుడు కేసులు పెట్టి శ్రీహరిని ఓ 15 రోజులు జైల్లో పెట్టగలరు.. అంతకంటే ఏం చేయగలరు?. జైలు నుంచి బయటకి వచ్చాక జగన్ దగ్గర పనిచేయకుండా ఆపగలరా?. ఒకవేళ శ్రీహరి తప్పు చేస్తే అందరి ముందు అరెస్ట్ చేయండి. అలా కాకుండా దొంగతనంగా ఎత్తుకెళ్లడం దేనికి.. కంప్యూటర్లు, సెల్ ఫోన్లు సీజ్ చేయడం దేనికి?. ఎవరిని భయపెడదామనుకుంటున్నారు. ఇలాంటి తప్పుడు పోకడగలకు ఏ ప్రభుత్వాలు పోలేదు. రాజకీయ కక్షల కోసం పోలీసులను వాడుకున్న వాడు బతికిబట్టకట్టలేదు.
40 ఏళ్ల ఇండస్ట్రీ అని నీతులు చెప్పడం సరికాదు. ఏపీలో పోలీసు వ్యవస్థను పతనావస్థకు తీసుకెళుతున్నారు. మీ కొడుకు మాటలు విని వ్యవస్థను నాశనం చేస్తే పర్యవసనాలు మీరు అనుభవించాల్సి వస్తుంది చంద్రబాబు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు ఏమైపోతారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెట్టినంత మాత్రాన మమ్మల్ని ఏం చేయలేరు. మీ కేసులు అరెస్టులు జగన్ వెంట జెండా మోయకుండా ఆపలేరు. ఇప్పటికైనా తప్పుడు కేసులు పెట్టడం చంద్రబాబు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. తప్పుడు పనులు మానుకోవాలని లోకేష్ సూచిస్తున్నాం’ అని హితవు పలికారు.


