
తిరుపతి: టీటీడీ గోశాలలో అధిక సంఖ్యలో గోవులు చనిపోతే వాటిని తాను బయటపెడితే అవి మార్ఫింగ్ ఫోటోలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి తాను చూపిన ఫోటోలు మార్ఫింగ్ చేసినవి కాదని, తాను ఏవైతే వ్యాఖ్యలు చేశానో ఏమైతే చూపానో వాటికి కట్టుబడి ఉన్నానన్నారు.
తాను చెప్పింది అబద్ధమైతే ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని భూమన చాలెంజ్ చేశారు. గోవుల మృతిపై ఎట్టకేలకు టీటీడీ ఈవో, చైర్మన్ లు నిజాన్ని ఒప్పుకున్నారని, వెంటనే ఈవోను సస్పెండ్ చేసి, చైర్మన్ ను తొలగించాలని భూమన డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి ఈరోజు(సోమవారం) భూమున ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..
‘మీ పాలనలో దళారీలకు కొదవే లేదు. ఇప్పటికి దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో అమ్మకాలు చేస్తున్నారు. మీ పాలనలో కొండపై బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లను ఇవ్వొద్దు, టిడిపి నాయకులకు కోరినన్ని టికెట్ల ఇవ్వడమే మీ పని. స్వామీజీలు, పీఠాధిపతులు తో వెళ్ళి గోశాలలో పాతిపెట్టినవి వెలికి తీద్దాం. 50 ఏళ్లకు ముందే నేను జైలుకు వెళ్లిన వాడ్ని

గతంలో కొండపై చర్చి కడుతున్నారు అంటూ విష ప్రచారం చేశారు, నెయ్యి కల్తీ అని ఎక్కడ నిర్ధారణ కాలేదు.. కల్తీ జరిగింది అని విష ప్రచారం చేశారు. అడుగు అడుగునా విష ప్రచారం చేశారు మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా గోవులు చనిపోయాయి, మీరు అంగీకరించారు. 1500 లీటర్లు పాలు మా పాలనలో కొండకు వెళ్తే ఇప్పుడు 500 లీటర్లు. అసలు సమస్యను పక్కదారి పెట్టొద్దు. దళిత గోవిందం అనే కార్యక్రమం నేను ఛైర్మన్ గా ఉన్నపుడు చేశాను. శ్రీవారి కళ్యాణోత్సవాలు దేశం, ప్రపంచం వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది మేము. 36వేల మందికి కళ్యాణోత్సవం ద్వారా పెళ్ళిళ్లు చేయించాం.
వేద విశ్వ విద్యాలయం తీసుకు వచ్చింది వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగింది. హైందవ మతం ప్రచారం కోసం 4 వాహనాలు దేశం నలుమూలల చేసేలా చర్యలు తీసుకున్నాం. సాధువులతో, పీఠాధిపతిలతో తిరుపతి మహాతీలో సదస్సు నిర్వహించాము. వందే గోమాతరం కార్యక్రమం చేసిన ఘనత మాది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని తీర్మానం చేశాం. హిందూ ధర్మం అంటున్న టిటిడి బి.ఆర్ నాయుడు కనీసం నాలుగు పద్యాలు పలుకగలరా’ అని భూమన నిలదీశారు.