
ఓరుగల్లు కాంగ్రెస్ వర్గపోరు పంచాయితీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. వరంగల్ జిల్లా నేతలపైనే ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది.
హైదరాబాద్, సాక్షి: కొండా మురళి వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీకి ఫిర్యాదు చేశారు.
కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డిపై ఆయన క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. అందులో.. స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని, అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని.. అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్లిద్దరితో పాటు నాయిని రాజేందర్రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణా కమిటీని కోరారు. ఈ నివేదికను కమిటీ స్వీకరించింది.
క్రమశిక్షణ కమిటీతో కొండా మురళీ..
- కమిటీ ముందుకు రావాలని ఎవరూ నన్ను పిలవలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా. భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేయాలనుకున్నా. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ పోటీ చేసింది కాబట్టి నేను తప్పకున్నా. మరో పార్టీ నుంచి గండ్ర వచ్చినా ఆయన మద్దతు ఇచ్చి ప్రచారం చేశా. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు.
- కొండా సురేఖ-సీతక్కలు కలిసే పని చేసుకుంటున్నారు. సీతక్కతో మాకు పంచాయితీ లేదు. వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారు. కడియం కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
- పరకాల పూర్తిగా మాదే. రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశాం. అతనిప్పుడు మాపై గుడుపూటానీ రాజకీయాలు చేస్తున్నారు. మా మద్దతుతోనే రేవూరి గెలిచారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నారు. నాయిని తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడు.
- వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి నేనే కారణమని నాపై కోపంగా ఉన్నట్టున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చాను. పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చా. కొంతంది లాగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను అని కమిటీకి నిచ్చిన లేఖలో పేర్కొన్నారాయన.
వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్లో చిచ్చు రాజేశాయి. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు కొండా మురళి సుమారు 60 వాహనాల్లో.. భారీ అనుచరగణంతో హైదరాబాద్లోని గాంధీ భవన్కు బయల్దేరినట్లు వచ్చారు. లోపలికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెవరూ వివరణ ఇవ్వాలని కోరలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా’’ అని అన్నారు. తన వివరణకు సంబంధించిన ఆరు పేజీల పత్రాన్ని ఆయన సమర్పించినట్లు తెలుస్తోంది.

ఓ ఇంటర్వ్యూలో కొండా మురళి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నది అభియోగం. ఆ వ్యాఖ్యలతో ఓరుగల్లు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ కోరింది. అలాగే.. ఆయన తన కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించడమే కాకుండా, కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేయడం పార్టీ లోపలే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రధానంగా..
కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి వంటి నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు కలిసి అత్యవసరంగా సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని AICC తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జోక్యంతో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది.