సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తప్పుడు చరిత్రను రాసే ప్రయత్నం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం హేయమైన చర్య అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మహాత్మాగాంధీ మన దేశంలోనే కాదు.. ప్రపంచం గర్వించదగిన త్యాగశీలి. ఉపాధి హామీ చట్టంలో మార్పులు తేవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్రం.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ, దేశ స్వాతంత్రం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం గడిపిన నెహ్రూలను మరిపించే ప్రయత్నం చేస్తుంది. దేశంలో వలసల నివారణ కోసం సోనియా గాంధీ తీసుకువచ్చిన గొప్ప చట్టం ఇది. పేదలకు ఉపాధి హక్కును కల్పించి జీవనోపాధిని కల్పించింది. 20 ఏళ్లుగా కోట్ల మంది ఆకలి తీర్చిన చట్టం ఇది.
ఉపాధి హామీ పనుల్లో 90 శాతం మంది లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. 62 శాతం మంది మహిళలు లబ్ది పొందారు. పేదలకు ఆపన్న హస్తంలా నిలిచిన ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ఒక తెలంగాణలోనే గత ఏడాది 6 కోట్ల విలువైన పని దినాలు తగ్గించారు. పేదల పొట్ట కొట్టి కార్పోరేట్ శక్తులను పెంచి పోషించడమే బీజేపీ విధానం. పెట్రోల్, డీజిల్ రేటు మూడింతలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో రేటు పెరుగుతుంది. కేంద్ర ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రాల ఆదాయ వనరులు తగ్గాయి. ఇది చాలదు అన్నట్లు ఉపాధి హామీ నిధుల్లో 40 శాతం భారం వేయడం అన్యాయం. కేంద్రం చర్యల వల్ల ఒక్క తెలంగాణ మీదే 1800 కోట్ల అదనపు భారం పడుతుంది’ అని కామెంట్స్ చేశారు.


