సాక్షి,చెన్నై: రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోమని తమిళనాడు సీఎం విజయ్ స్పష్టం చేశారు. టీవీకే పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత విజయ్ తిరుచ్చిలో తన మొదటి సభను నిర్వహించారు.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పోరాటం ఇప్పుడు టీవీకే , డీఎంకే మధ్య మాత్రమే. ఇకపై ఎఐఎడీఎంకేకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదు. మా ప్రభుత్వం అందరి కోసం పని చేస్తోంది. రాష్ట్ర హక్కులు, లౌకికవాదం విషయంలో ఎలాంటి రాజీ పడబోదు’అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తనపై వచ్చిన హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) ఆరోపణలను విజయ్ ఖండించారు. డీఎంకే ఎఐఎడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. మీరు ఎన్నో సంవత్సరాలుగా మోసం చేసిన ఇద్దరిని తిరస్కరించి మీ విజయ్ను, మీ అన్నను, మీ తమ్ముడిని ఎన్నుకున్నారు. నేను ముఖ్యమంత్రి కాదు, మీ సేవకుడినంటూ సభకు హాజరైన ప్రజలు, పార్టీ శ్రేణుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దుస్తులపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ.. నేను సూట్ ఎందుకు ధరించకూడదు? నేను రంగులు మార్చలేను, రంగురంగుల దుస్తులు ధరించలేను. అందుకే సూట్ ధరిస్తున్నాను. నేను ధరిస్తున్న సూట్ను కూడా వాళ్లు విమర్శిస్తున్నారు. మనం కోటు సూటు ధరించకూడదా? విజయ్ ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ నిజాయితీగా ఉంటాడనే విషయాన్ని ఇది సూచిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గాన్ని కొనసాగించారు. సభకు ఆయన రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి వేదిక వరకు ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.


