ప్రజారోగ్యంపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదు: డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపట్ల సీఎం కేసీఆర్కు కనీస చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం, వారి ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి భారం పడకుండా చూడాలని ప్రధాని చేసిన సూచనల గురించి కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా కేసీఆర్కు లేదని మండిపడ్డారు.
దేశ ప్రధాని ప్రజల కోసం తన సమయాన్ని కేటాయిస్తే, సీఎం కేసీఆర్ మాత్రం ఇతర పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యవహారశైలిని గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
మరిన్ని వార్తలు