కల్తీ రాయుళ్లకు సీపీ సజ్జనార్‌ వార్నింగ్‌ | CP Sajjanar has warned that action will be taken under the law against those involved in adulteration | Sakshi
Sakshi News home page

కల్తీ రాయుళ్లకు సీపీ సజ్జనార్‌ వార్నింగ్‌

Apr 2 2026 8:29 PM | Updated on Apr 3 2026 10:20 AM

CP Sajjanar has warned that action will be taken under the law against those involved in adulteration

సాక్షి,హైదరాబాద్: నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, స్వలాభం కోసం కల్తీకి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్  వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కల్తీ అనేది కేవలం వ్యాపారం కాదని, అది సమాజంపై జరుగుతున్న దాడి అని ఆయన అన్నారు.

గురువారం బషీర్‌బాగ్‌లోని పాత పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో 'హెచ్‌-ఫాస్ట్‌' ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మాంసం, పాలు, బేకరీ ఉత్పత్తులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి తదితర విభాగాలకు చెందిన సుమారు 200 మంది వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, గత నెల రోజుల వ్యవధిలోనే నగరవ్యాప్తంగా 92 కేసులు నమోదు చేసి, సుమారు 62 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న 98 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యాపారులు వ్యవహరించాలని హితవు పలికారు. కల్తీ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖ్యాతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యాపారిపై ఉందని అన్నారు. ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ కలిగి ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు సమాచారం ఉంటే తక్షణమే పోలీసులకు తెలపాలని కోరారు.

నిజాయితీగా వ్యాపారం నిర్వహించే వారికి పోలీసు శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వ్యాపార ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసుల చొరవను వ్యాపారులు అభినందిస్తూ, కల్తీని అరికట్టడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్‌ రఘునాథ్‌, అదనపు డీసీపీ ఏ. శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement