సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిల్వ ఉంచిన కుళ్ళిన గొర్రె, మేక మాంసాన్ని (పాయా, ముడి, బీజా, గురుదా, కలేజీ తదితర అవయవాలు) విక్రయిస్తున్న ఒక భారీ నెట్వర్క్ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ టీమ్), హెచ్-ఫాస్ట్ (H-FAST) మరియు మంగళ్హాట్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు.

మంగళ్హాట్లోని 'A to Z షీప్ అండ్ గోట్ ఆఫ్ఫల్' స్టోర్పై మెరుపు దాడి చేసి సుమారు 12 టన్నుల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. పది లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడు రఫీ అహ్మద్ను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు, స్టోర్ యజమాని మొహమ్మద్ అఫ్రోజ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

అఫ్రోజ్పై గతంలో జీహెచ్ఎంసీ జరిమానా విధించడంతో పాటు, మంగళ్హాట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుడు రఫీ అహ్మద్.. యజమాని అఫ్రోజ్ సహాయంతో హోల్సేల్ మార్కెట్ నుండి తక్కువ ధరకు పాడైపోయిన గొర్రె, మేక అవయవాలను సేకరించేవాడు. ఈ మాంసాన్ని మంగళ్హాట్, అమాన్ నగర్ కాలనీలోని తమ స్టోర్లో నిల్వ చేసేవారు. మాంసం కుళ్లిపోకుండా దుర్వాసన రాకుండా ఉండేందుకు డీప్ ఫ్రీజర్లు, నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో ఎక్కువ కాలం నిల్వ ఉంచేవారు. అనంతరం, ఈ కుళ్లిన మాంసాన్ని తాజా మాంసంగా నమ్మించి హోటళ్లు, శుభకార్యాలకు, ఇతర ఈవెంట్లకు సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.



