హైదరాబాద్: అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తుగ్లక్ తీర్మానం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిభ్రమించే అమరావతి రాజధాని బిల్లును శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 2వ తేదీ) హైదరాబాద్లోని ప్రెస్క్లబ్ నుంచి మీడియాతో మాట్లాడారు ఎస్వీ సతీష్రెడ్డి.
‘అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి, పోలవరం పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. అమరావతిపై మండలిలో చంద్రబాబు ఎందుకు తీర్మానం పెట్టలేదో చెప్పాలి. అమరావతిపై చంద్రబాబు ఎందుకు హైప్ చూపిస్తున్నారో చెప్పాలి. మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది.
అమరావతిలో సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగులు ఏం అవసరం ఉంది. తెలంగాణ సచివాలయం కట్టడానికి రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.
కమీషన్ల కోసమే చంద్రబాబు అమరావతిలో పనులు చేయిస్తున్నారు. అమరావతి, పోలవరంను చంద్రబాబు, లోకేష్ ఏటీఎంల వాడుతున్నారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 11 సంవత్సరాల్లో అమరావతి నుంచి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. చంద్రబాబుకు దమ్ము ధైర్మం ఉంటే ఆల్ పార్టీ సమావేశం పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.
అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు..
అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీ, అవినీతికే తాము వ్యతిరేకమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు సతీష్రెడ్డి. ‘చంద్రబాబు పిలుస్తున్న టెండర్లలో పారదర్శకత లేదు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తే చూస్తూ ఊరుకోం.
కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు నివాసం ఉండటం లేదో చెప్పాలి?, అమరావతిలో చంద్రబాబు చేసే దోపిడీకి వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మావిగన్(MAVIGUN)పై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.



