
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గం
కంటోన్మెంట్ని రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి జి.సాయన్న ఐదోసారి విజయం సాదించారు. ఆయన గతంలో నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఈసారి టిఆర్ఎస్ తరుపున గెలిచారు. 2014లో ఆయన టిడిపి అభ్యర్దిగా గెలుపొందినా, తదుపరి జరిగిన పరిణామాలలో టిఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఈసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్దిగా పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై 37568 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. ఇక్కడ బిజేపి తరపున పోటీచేసిన శ్రీ గణేష్కు 15500 ఓట్లు వచ్చాయి. సాయన్నకు 65752 ఓట్లు రాగా, సర్వే సత్యనారాయణకు 28184 ఓట్లు వచ్చాయి.
మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో నాలుగుసార్లు గెలుపొందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ పి.శంకరరావు 2009లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పోటీచేసి ఐదోసారి గెలుపొందినా 2014లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కంటోన్మెంట్లో రెండుసార్లు గెలిచిన బి.వి గురుమూర్తి, ఒకసారి ఖైరతాబాద్లో గెలిచారు. 1967లో ఇక్కడ గెలిచిన వి. రామారావు 1957లో షాబాద్లో, 1962లో చేవెళ్ళలో గెలిచారు. ఆయన మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య వి.మంకమ్మ ఇక్కడ గెలిచారు. ఆ తర్వాత మరోసారి కూడా గెలుపొందారు.
ఇక్కడ గెలిచిన వారిలో బి.వి గురుమూర్తి, ఎన్.ఎ.కృష్ణ. డి. నర్సింగరావులు, డాక్టర్ శంకరరావు మంత్రి పదవులు నిర్వహించారు. మరో నేత గురుమూర్తి రాజ్యసభ సభ్యనిగా కూడా వున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు 14సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఏడుసార్లు, జనతా పార్టీ ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు గెలిచాయి. శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడయ్యారు. కాని ఆ తర్వాత కాలంలో ఆయన సి.ఎమ్.తో విభేదాలలో ఇరుక్కుని పదవి కోల్పోయారు. అయితే ఈయన రాసిన లేఖ ఆధారంగా హైకోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశించింది.
ఆ తర్వాత జగన్ను సిబిఐ అరెస్టు చేయడంతో అదంతా రాజకీయ వివాదంగా మారింది. రాష్ట్రంలో కీలకమైన పరిణామానికి కారకుడైన శంకరరావు ముఖ్యమంత్రి కిరణ్ను తీవ్రంగా విమర్శించి మంత్రి పదవిని కోల్పోవడం విశేషం. తదుపరి కాంగ్రెస్ టిక్కెట్ను కూడా పొందలేక పోయారు. సర్వే సత్యనారాయణ ఒకసారి టిడిపి పక్షాన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ నుంచి సిద్దిపేట, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాలలో గెలుపొందారు. మల్కాజిగిరి జనరల్ స్థానం అయినప్పటికి కాంగ్రెస్ ఐ తరపున ఈయన పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవి కూడా చేశారు. 2018లో కంటోన్మోంట్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..