కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Political Counters Between BJP And TDP, BJP Reacts On JC Prabhakar Reddy Comments, More Details | Sakshi
Sakshi News home page

కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Jan 3 2025 11:56 AM | Updated on Jan 3 2025 12:54 PM

Political Counters Between BJP and TDP JC Prabhakar Reddy

సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్‌ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్‌ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.

తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇక, అంతకుముందు ‍ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్‌ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో జరిగి ఉంటుందని ట్రావెల్స్‌ మేనేజర్‌ అనంతపురం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది.  

ఫ్లైయాష్‌ వివాదమే కారణమా? 
నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది.  

 జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

Advertisement
 
Advertisement
Advertisement