మహారాష్ట్రలో ఎన్డీయే ఢీలా.. ఆధిక్యంలో ఇండియా కూటమి | Maharashtra Lok Sabha Election Results: INDIA bloc overpowers NDA | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఎన్డీయే ఢీలా.. ఆధిక్యంలో ఇండియా కూటమి

Jun 4 2024 1:23 PM | Updated on Jun 4 2024 1:34 PM

Maharashtra Lok Sabha Election Results: INDIA bloc overpowers NDA

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అందరిని షాక్‌కు గురిచేస్తున్నాయి. జాతీయ స్థాయిలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రల్లో బీజేపీ, ప్రధాని మోదీ చరిష్మా తగ్గింది. అయోధ్య రామనాయం పనిచేయనట్లు కనిపిస్తుంది.  2019 ఫలితాలో పోలిస్తే తాజాగా బీజేపీ గ్రాఫ్‌ ఘోరంగా పడిపోయింది. ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, బెంగాల్‌, మహారాష్ట్రలో గతం కంటే సగం సీట్లు కోల్పోయింది కాషాయ పార్టీ.

చాలా చోట్ల ఊహించని విధంగా ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రలో ఇండియా కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండగా.. ఎన్డీయే వెనుకంజలో ఉంది.  

మొత్తం 48 స్థానాల్లో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ 12 చోట్ల, శివసేన(షిండే వర్గం) ఆరు చోట్ల, ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) ఒకచోట ఆధిక్యతలో ఉంది. కేంద్ర మంత్రులు  నితిన్‌ గడ్కరీ, పీయూష్‌ గోయల్‌ ముందంజలో ఉన్నారు. 

మరోవైపు మహా వికాస్‌ అఘాడి కూటమిలో భాగస్వామ్యమైన  శివసేన(ఉద్దవ్‌ వర్గం) 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 10 సీట్లలో, ఎన్సీపీ(శరద్‌ పవార్‌) ఎనిమిది చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి సాంగ్లీ నుంచి పోటీ చేసిన  స్వతంత్ర అభ్యర్థి విశాల్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తానికి ఎన్డీయే కూటమి 19 చోట్ల, ఇండియా కూటమి 28 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట  ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా 48 లోక్‌సభ స్థానాలతో దేశంలో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అయిదు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరిగాయి. మొత్తం 61 శాతం పోలింగ్‌ నమోదైంది.  ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్డీయే 30 స్థానాలు గెలుచుకుంటుందని, ఇండియా 18 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వాస్తవ ఫలితాలు తారుమారు చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement