
సాక్షి, వికారాబాద్: కారు కేవలం సర్వీసింగ్కు పోయిందని, మళ్లీ వంద స్పీడుతో దూసుకొస్తదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వికారాబాద్లో జరిగిన పరిగి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మార్పు కావాలి అనోళ్లంతా నెత్తినోరు కొట్టుకుంటున్నరని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన రెండు లక్షల రుణమాఫీ ఏదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు...420 హామీలని గుర్తు చేశారు.
‘ఉచిత బస్సు తో మహిళలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఓ గల్లీ కాంగ్రెస్ కార్యకర్త మాట్లడినట్టు ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని బట్టలిప్పి చౌరస్తాలో నిలబెడతాం. బీజేపీ పెద్ద నేతలను ఓడగొట్టింది బీఆర్ఎస్ కాదా బీజేపీ బీఆర్ఎస్కు పొత్తు ఉంటే మా ఆడ బిడ్డపై కేసు ఉంటుండెనా
పూడూరులో నేవీ రాడార్ స్టేషన్ వస్తే పర్యావరణం దెబ్బ తింటుందని స్థానికులు చెబుతున్నారు. అది మాకు తెలిసే ఆ ప్రాజెక్టు పదేళ్ళుగా ఆపుతూ వస్తున్నాం. పన్నెండు లక్షల చెట్లు నరికే ప్రయత్నం చేస్తే పర్యావరణ వేత్తలు ఎక్కడపోయిండ్రు. చెట్లు నరికితే వర్షాలు పడతాయా? ప్రజాభిప్రాయ సేకరణ చేయరా..? అవగాహనా సదస్సులు పెట్టరా... ఉన్న అడవి పోతది..పర్యావరణం దెబ్బతింటుంది.. మన ప్రాంతానికి ఏం రాందు రాడార్ స్టేషన్కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది.
యాభై రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూస్తాం. కాంగగ్రెస్సోళ్లు ఐదేళ్లు ఉంటారా.. మధ్యలో పోతారా చూస్తాం. మూడు అడుగులు లేనోడు బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో పెడ్తడంటా.. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలే.. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించాలె. వరుసగా ఎన్నికలొస్తున్నయ్..అందరూ అప్రమత్తంగా ఉండాలె.
కష్టపడి పార్టీ గెలుపునకు కృషి చేయాలె 12 మంది ఎంపీలు గెలిస్తే జాతీయ పార్టీలకు వణుకు పుడుతది. శ్రీ రాముని పేరిట అక్షింతలు పంచి సెంటిమెంట్ రగిలించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం బీజేపీది. పప్పు, ఉప్పు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన మోదీని దేవుడు అంటడు బండి సంజయ్. పార్లమెంట్ ఎన్నకల కోసం సిద్దం కావాలె.. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలె’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.