
హైదరాబాద్, సాక్షి: దేశంలో సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని.. రాబోయే 30 ఏళ్ల కాలంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సాక్షికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారాయన.
2006లో పార్టీలో అడుగుపెట్టినప్పుడు కనీసం మంత్రి కూడా అవుతానని, ఈ స్థాయి గౌరవం లభిస్తుందని ఊహించలేదు. ఈనాటికి సీఎం అవ్వాలనే ఆశ నాకు లేదు. వచ్చే ఎన్నికల్లోనూ మా సీఎం అభ్యర్థి కేసీఆరే. ఆయన మా ట్రంప్ కార్డు. తురుపు ముక్క. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. కాంగ్రెస్ హయాంలో పాడైపోయిన వ్యవస్థను బాగు చేయడమే మా ముందు ఉన్న లక్ష్యం అని స్పష్టం చేశారాయన.
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 420 హామీలు ఇచ్చినా ఒక్కటి అమలు చేయలేదు. 15 నెలల పాటనలో సంక్షేమం అమలు చేయలేదు. అధికారం కోసం ఇష్టమున్నట్లు హామీలు ఇచ్చారు. పథకాలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నికృష్టంగా పని చేస్తోంది. నా వరకు నేను ఈ ప్రభుత్వానికి మైనస్ మార్కులు ఇస్తాను. లిక్కర్ విషయంలో మాత్రమే పెరుగుదల కనిపిస్తోంది. కేసీఆర్ సర్కార్ది సంక్షేమం.. రేవంత్ సర్కార్ది సంక్షోభం అన్నారు.
హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలు అయ్యింది. తులం బంగారం లేదు.. స్కూటీ లేదు. ఫార్ములా రేసులో ఎలాంటి అవినీతి జరగలేదు. సీఎం పదవి వచ్చాక సమర్థవంతంగా పని చేయొచ్చు కదా. ఫార్ములా ఈ కోసం ఖర్చు చేస్తే తప్పైతే.. అందాల పోటీతో ఖర్చు చేయడం కరెక్టా?. ఫార్ములా ఈ రేసు కోసం చేసిన ఒప్పందాలతో పెట్టుబడులు తెచ్చాం. అందాల పోటీతో ఎంత మందికి ఉపాధి లభిస్తుంది. లైవ్లో డిబేట్ పెడితే.. ఎవరిది మోసమో అర్థం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని కేటీఆర్ జోస్యం పలికారు.
కేసీఆర్ పథకాలను పక్క రాష్ట్రాల్లో కాపీ కొట్టారు. దేశం మొత్తం ఆ పథకాలు అమలు కావాలనే.. పార్టీని దేశ స్థాయిగా విస్తరించాలనుకున్నాం. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా విస్తరించాం. బీఆర్ఎస్ మీదనే మాకు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితం వచ్చింది. కాబట్టి మళ్లీ పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం.
బీఆర్ఎస్లో ఎలాంటి కుమ్ములాటలు లేవు. అలాగే.. హరీష్రావుతో నాకు ఎలాంటి విబేధాల్లేవ్. మా అందరికి కావాల్సినంత పని ఉంది. ఎజెండా తిరిగి తెలంగాణలో పట్టాలెక్కాలి. రాష్ట్రం కేసీఆర్ నాయకత్వం కోరుకుంటోంది. కేసీఆర్ ఉన్నంతదాకా.. ఆ ప్రస్తావన రాదు.
తెలంగాణ వచ్చాక.. మూడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాం. త్రిముఖ పోటీ(బీజేపీ+జనసేన+టీడీపీ), కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ ప్రభావం మా మీద ఉండదని అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఒంటరిగానే పోటీ చేస్తాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది.
