చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్‌ సవాల్‌ | Kesineni Nani Serious Comments Over Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్‌ సవాల్‌

Jan 28 2024 9:10 PM | Updated on Feb 5 2024 4:30 PM

Kesineni Nani Serious Comments Over Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్‌ సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు తన మీద గెలిచే దమ్ముందా అని కామెంట్స్‌ చేశారు. అలాగే, నారా లోకేష్‌ ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, కేశినేని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలో అంబేద్కర్ ఉన్నారు, నేను ఉన్నాను. నాని మీద నేను గెలుస్తా అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నేను మూడు లక్షల ఓట్లతో గెలుస్తున్నా. కాల్ మనీ గాళ్లు కాదు బస్తీమే సవాల్.. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబే నాపై పోటీచేయాలి. నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. జనవరి మూడో తేదీ చంద్రబాబు నాయుడికి తిరువూరు నియోజకవర్గం సమాధి కట్టింది. 

చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివి. దానికి మూల కారణం తిరువూరు సంఘటనే. ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మూసుకున్నా అవమానాలు పడ్డాను. సీఎం జగన్ మమ్మల్ని ఆలింగనం చేసుకుని మీలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండాలని ఆహ్వానించారు. కొడుకు లోకేష్‌ను సీఎం చేయాలనే అజెండాతో చంద్రబాబు పని చేస్తున్నాడు. 33వేల ఎకరాలు రైతుల వద్ద తీసుకుని మోసగించాడు. అందుకే సొంతిల్లు కూడా కట్టలేదు. చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నాడు. 

సీఎం జగన్‌ నిజమైన అంబేద్కర్‌వాది. కొన్ని మీడియా సంస్థలు ఏపీ అభివృద్ధి జరగలేదంటూ గొంతు చించుకుంటున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే అదే మానవ అభివృద్ధి. మళ్లీ సీఎం జగన్ గెలిస్తేనే పేదవాళ్లందరూ సంతోషంగా ఉంటారు. చంద్రబాబు గెలిస్తే ధనికులు హ్యాపీగా ఉంటారు. సీఎం జగన్‌ను మొదటగా స్వామిదాస్ అడిగింది ఒక్కటే వినగడప కట్టలేరు బ్రిడ్జి. రూ.26కోట్ల వ్యయంతో ఫిబ్రవరి మూడో తేదీన కట్టలేరు బ్రిడ్జికు శంఖుస్థాపన చేయబోతున్నాం. స్వామిదాస్ పక్కా లోకల్.. మనకు అన్ని చేసిపెట్టే వ్యక్తి సీఎం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement