ప్రజా పాలనలో ఇంతటి దుస్థితినా?: హరీశ్‌రావు | Harish Rao Slams Revanth Sarkar Over Ambulance Incidents | Sakshi
Sakshi News home page

ప్రజా పాలనలో ఇంతటి దుస్థితినా?: హరీశ్‌రావు

May 25 2026 10:29 AM | Updated on May 25 2026 10:29 AM

Harish Rao Slams Revanth Sarkar Over Ambulance Incidents

సాక్షి, హైదరాబాద్‌: గర్భిణి రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవించాల్సిన పరిస్థితి… మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి… అంటూ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా ‘ప్రజా పాలన’నా అంటూ రేవంత్‌ సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారాయన. 

తాండూర్‌లో ఓ నిరుపేద గర్భిణికి 108 అంబులెన్స్ సేవలు సమయానికి అందలేదని, ఫలితంగా ఆమె రైల్వే ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో భద్రాచలంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు హియర్స్ వాహనం అందుబాటులో లేక కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన ఘటన కూడా చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఘటనలకు సంబంధించిన పేపర్‌ క్లిప్పింగులను పోస్ట్‌ చేశారు.

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు, హియర్స్ వాహన సదుపాయాలు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారాయన. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాల్సిన వ్యవస్థలు ఇలా కుప్పకూలడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన సేవలు పనిచేయకపోవడం, మరణానంతరం గౌరవం ఇవ్వాల్సిన వ్యవస్థలు కూడా విఫలమవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 108 సేవలను, హియర్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బాధ్యతను నిర్ణయించాలని రేవంత్‌ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement