
వంద అసెంబ్లీ సీట్లలో గులాబీ జెండా ఎగురుతుంది: హరీశ్రావు
దివానా గాళ్లే తెలంగాణ దివాలా తీసింది అంటారు
బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం
సీఎం రేవంత్రెడ్డితో తెలంగాణకు తలవంపులు
రేవంత్కు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే మనుగడ సాగిస్తూ.. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది. వంద అసెంబ్లీ సీట్లతో గులాబీ జెండా ఎగురుతుంది’అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొ న్న అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్రావు ప్రసంగించారు. ‘బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపం కాబోతున్నా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటం లేదు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తాం. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా, గురువు చంద్రబాబుకు దాసోహం అయిన సీఎం ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా, ఢిల్లీలో ధర్నా చేసినా కలసి వచ్చేందుకు సిద్ధం, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఏదైనా చేస్తాం’అని హరీశ్ అన్నారు.
ఆ ఫుటేజీ బయట పెట్టాలి..
‘సీఎంకు దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయట పెట్టి, వారిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణకు తలవంపులు తెచ్చారు’అని హరీశ్ ధ్వజమెత్తారు.
రేవంత్ పాలనలో ఆదాయం నేలచూపులు..
‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేసే వాళ్లు దివానా గాళ్లు. ఆరు గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చి, తాను తీసుకున్న గోతిలో రేవంత్ తానే పడిపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్రెడ్డి.. తెలంగాణ ద్రోహి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్కు లేదు’అని హరీశ్ విమర్శించారు.
దుర్మార్గుల చేతుల్లోకి తెలంగాణ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి గందర గోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు కలిచివేశాయని, ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ప్రసంగించారు. మధుసూదనాచారి, హరీశ్రావు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తర్వాత జాతీయ పతాకాన్ని మధుసూదనాచారి ఆవిష్కరించారు.