సాక్షి, హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల పెంపు, డీ లిమిటేషన్ వేరువేరు అంశాలు అంటూ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించారు సీఎం రేవంత్. మహిళా రిజర్వేషన్ను అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా..‘మహిళా రిజర్వేషన్ల పెంపు, డీ లిమిటేషన్ వేరువేరు అంశాలు. మహిళా రిజర్వేషన్లకు దేశమంతా మద్దతు ఇస్తుంది. కానీ, లోక్సభ సీట్ల పునర్విభజనపై అనేక సందేహాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళా కోటాను వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్ను అంశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. జనాభా ఆధారంగా లోక్సభ పునర్విభజనను ముందుకు తెచ్చే ప్రయత్నాలు ఆపాలి. బీజేపీ చేసే ప్రయత్నం బీజేపీకి మాత్రమే లాభం. బీజేపీ కుట్రతో దక్షిణాది రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. బీజేపీ చర్య దేశాన్ని బలహీనపరుస్తుంది. పార్టీ ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఢిల్లీలో నారీ శక్తి వందన్ సమ్మేళన్ కార్యక్రమం మోదీ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం రేవంత్ ఇలా వ్యాఖ్యలు చేయడం విశేషం. పార్లమెంటు కొత్త చరిత్ర లిఖించడానికి చేరువలో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 21వ శతాబ్దం మహిళలకు చెందిందని చెప్పారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని పేర్కొన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయం మహిళలకు అంకితం చేస్తున్నామని తెలిపారు.


