జార్ఖండ్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి చంపై సోరెన్‌? | Champai Soren may join bjp he heads to delhi Sources | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. బీజేపీలోకి చంపై సోరెన్‌?

Aug 18 2024 12:44 PM | Updated on Aug 18 2024 5:28 PM

Champai Soren may join bjp he heads to delhi Sources

రాంచీ: మరికొన్ని రోజుల్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. రాజకీయ సంక్షోభం దిశగా జార్ఖండ్‌లో పరిణామాలు వేగంగా కొనసాగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్‌ ముక్తిమోర్చా (జేఎంఎం) నేత చంపై సోరెన్‌ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ఎమ్మెల్యేలతో చంపై ఢిల్లీ చేరుకున్నట్లు జాతీయ మీడియా వార్తలు వెల్లడిస్తోంది. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలుస్తోంది. 

మరోవైపు.. ఢిల్లీకి చేరుకున్న చంపై సోరెన్‌ను బీజేపీ నేత సువేందు అధికారిని కలిశారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘నేను ఎవరినీ కలవలేదు. వ్యక్తిగత పని కోసం ఇక్కడకు వచ్చాను’ అని అన్నారు.

 

ప్రస్తుతం సీఎం హేమంత్‌ సోరెన్‌ కేబినెట్‌లో చంపై మంత్రిగా ఉ‍న్నారు. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరి 31న అరెస్టు చేయగా.. అనంతరం చంపై సోరెన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంపై సోరెన్ జూలై 3న  ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఇక.. హేమంత్ సోరెన్ మరోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి చంపై సోరెన్ సంతోషంగా లేరని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. జార్ఖండ్‌ మొత్తం 81 స్థానాలకు గాను అధికార జేఎంఎంకు 45 సీట్లు, ప్రతికక్షాలకు 30 సీట్లు ఉన్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement