Central Minister Smriti Irani Strong Counter To Rahul Gandhi Comments - Sakshi
Sakshi News home page

రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి స్మృతి ఇరానీ

Aug 9 2023 1:16 PM | Updated on Aug 9 2023 2:47 PM

Central Minister Smriti Irani Strong Counter To Rahul Gandhi Comments - Sakshi

న్యూ ఢిల్లీ: బుధవారం జరిగిన లోక్ సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపైనా ప్రధానిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అంతేస్థాయిలో తిప్పికొట్టారు. మీరసలు భారత దేశానికి చెందినవారే కాదన్నారు.  

బుధవారం పార్లమెంటు సమావేశాలు మొదలవుతూనే ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈరోజు సమావేశాల్లో లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి సభలో ప్రసంగించారు. ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం సందర్బంగా మాట్లాడిన రాహుల్ మణిపూర్ భారత దేశంలో భాగమన్న విషయాన్ని ప్రధాని మర్చిపోయారని, మణిపూర్ లో భారత మాతను చంపేశారన్నారు. రావణాసురుడు ఎలాగైతే కుంభకర్ణుడు, మేఘనాధుడు ఇద్దరి మాటలు విన్నాడో ప్రధాని కూడా ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల మాటలే వింటున్నారని విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం తన స్వార్ధ రాజకీయాల కోసం ఒకే దేశంలో రెండు మణిపూర్ లను సృష్టించారన్నారు.   

 రాహుల్ మాట్లాడిన తర్వాత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ విభజించబడలేదు.. ఒక్కటిగానే ఉందన్నారు. ఆయన మణిపూర్లో భారత మాత చంపబడిందని అన్నారు. దానికి వారి మద్దతుదారులంతా చప్పట్లు కూడా కొట్టారు. కుటుంబపాలనలో దేశం చాలా నాశనమైంది. అందుకే కుటుంబపాలను స్వస్తి పలకాలి. అవినీతికి స్వస్తి పలకాలి అన్నారు. మీరనుకునే ఇండియా కాదిది. అవినీతి రహిత ఇండియా. ఇక్కడ కుటుంబపాలనకు చోటు లేదన్నారు. అసలు మీరు ఇండియాకు చెందిన వారే కాదన్నారు. నాడు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా నినదించినట్లు ఇప్పుడు మీ కుటుంబ పాలనకు,అవినీతి పాలనకు వ్యతిరేకంగా మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదించాలన్నారు.

కశ్మీర్ లో గిరిజా టిక్కు అనే పండిట్ పై సామూహిక అత్యాచారం చేసి క్రూరంగా చంపేశారు. అదే విషయాన్ని సినిమాలో చూపిస్తే కొంతమంది కాంగ్రెస్ లీడర్లు దాన్ని దుష్ప్రచారమన్నారు. ఇప్పుడు విచిత్రంగా వారే మాట్లాడుతున్నారు. రాజ్జస్థాన్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న బిల్వారాలో అభంశుభం తెలియని పసికందుపై మానభంగం జరిగింది. ఇవేవీ మీకు కనిపించవా? అంటూ ప్రశ్నించారు.  ఈ సందర్బంగా ఆమె 1984లో కాంగ్రెస్ పాలనలో నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. చరిత్ర చూస్తే కాంగ్రెస్ పాలన అంతా రక్తసిక్తమై ఉంటుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement