హైదరాబాద్: కొత్తగా వచ్చే పార్టీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. పోయాయి అంటూ కేటీఆర్ తనదైన శైలిలో పేర్కొన్నారు. కవిత పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) గురించి మీడియా అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. పైవిధంగా పేర్కొన్నారు.
ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ తెలంగాణలో కనీస మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ సంక్షోభంపై బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో చర్చించాం. రైతుల పక్షాన నిలబడాలని నిర్ణయించాం’ అని తెలిపారు.
‘బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణను అవమానిస్తే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంది. లోక్సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభలో బీఆర్ఎస్ ఉండి ఉంటే తేజస్వితో క్షమాపణలు చెప్పించేవాళ్లం’ అని పేర్కొన్నారు.


